తెలంగాణా మీడియాలో మ‌రో సంచ‌ల‌నం..!
=======================================
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావంలో మీడియా పాత్ర చాలా కీల‌కం. అందులోనూ సీఎల్ రాజాం వంటి వారు ముందుకొచ్చి సొంత ప‌త్రిక ప్రారంభించ‌డం ద్వారా ఉద్య‌మానికి కొత్త ఊపిరిలూదారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ తో పాటు ఉద్య‌మానికి అండ‌గా నిలిచి అంద‌రి ఆద‌ర‌ణ పొందారు. ఆంధ్ర పత్రికలు రాజ్యమేలుతున్న సమయంలో తెలంగాణకోసం నమస్తే తెలంగాణ పత్రికను స్థాపించడం, దానికి విజ‌య‌వంతంగా న‌డ‌ప‌డం వివేషం. ఆ త‌ర్వాత మారిన ప‌రిణామాల‌తో సీఎల్ రాజాం త‌న ప‌త్రిక‌ను కేసీఆర్ చేతుల్లో పెట్ట‌డం, ఆయ‌నో అంగ్ల ప‌త్రిక కోసం ప్ర‌య‌త్నాలు అంద‌రికీ తెలిసిన‌వే. అలాంటి రాజాం ఇప్పుడు మ‌రో సంచ‌లనానికి శ్రీకారం చుట్ట‌బోతున్న‌ట్టు ప్రచారం సాగుతోంది. తెలంగాణాలో మ‌రో కొత్త ప‌త్రిక పురుడు పోసుకోవ‌డం కాదుగానీ..పాత ప‌త్రిక‌నే మళ్లీ కొత్త హంగుల‌తో జ‌నం ముందుకు తీసుకురాబోతున్న‌ట్టు చెబుతున్నారు.
ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న రాజాం త‌న‌కు కూడా మీడియా మ‌ద్ధ‌తు అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు స్వతహాగా పత్రికాభిమాని అయిన రాజాం వార్త పత్రికను కొనుగోలుకు ప్రయత్నిస్తున్న‌ట్టు ప్ర‌చారం మొద‌ల‌య్యింది. అంతా ఓకే అయిపోయిన‌ట్టు చెబుతున్నారు. త్వరలోనే వార్త పత్రికను పేరు మార్చి తెలంగాణలో తీసుకురావాలని యోచిస్తున్నట్టు రాజాం స‌న్నిహితులు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే వార్త కొత్త రూపంలో, కొత్త సార‌ధి చేతిలో వెలుగు చూడ‌డం ఖాయ‌మ‌నే స‌మాచారం ఇప్పుడు మీడియా వ‌ర్గాల్లో క‌ద‌లిక‌కు కార‌ణంగా మారుతోంది. గ‌డ్డు ప‌రిస్థితుల్లో ఇలాంటి స‌మ‌ర్థుడైన య‌జమాని సార‌ధ్యంలో వ‌చ్చే సంస్థ కొంత క‌ష్టాలు తీరుస్తుంద‌నే విశ్వాసం క‌నిపిస్తోంది. చూడాలి ఏం జ‌రుగుతుందో..!!

Comments