
===============================
మీడియా అంటేనే సెలబ్రిటీ లోకం. మీడియాలో చోటు కోసం ఓ స్థాయి వరకూ ప్రయత్నిస్తే చాలు..ఆ తర్వాత మీడియానే మన వెంట పడుతుంది. మనం ఏం చేసినా..ఏం కూసినా నిత్యం మనల్ని ఫోకస్ చేస్తుంటుంది. అందుకోసం రెగ్యులర్ మీడియాలో అయితే చాలా కష్టపడాలి. కాసులు ఖర్చు చేయాలి. ఓపికగా ప్రయత్నించాలి. కానీ సోషల్ మీడియా దానికి భిన్నం. మన దగ్గర సామర్థ్యం ఉంటే చాలు..అదే పెట్టుబడి. నూతన ఒరవడిలో సాగితే చాలు మన సత్తా నిరూపించుకోవచ్చు. చాలా తేలికగా సెలబ్రిటీ హోదా సాధించవచ్చు.
తెలుగులో సోషల్ మీడియాలో ఎఫ్ బీ దే ప్రధాన పాత్ర. దేశంలో ట్విట్టర్ కి ప్రముఖులంతా పెద్ద పీట వేస్తున్నప్పటికీ ఫేస్ బుక్ మాత్రం సాధారణ జనాలకు ఓ పెద్ద సాధనంగా మారింది. ప్రస్తుతం తెలుగు గడ్డ మీద సోషల్ మీడియాలో తమదైన శైలిలో అందరినీ ఆకట్టుకుంటున్న కొందరి గురించి అప్ డేట్ ఏపీ ప్రస్తావించాలనుకుంటోంది. అందులో పలువురు జర్నలిస్టులే కాకుండా..సాధారణ, ఔత్సాహిక రాజకీయ వేత్తలు, సామాజిక నిపుణులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తున్న కొందరిని ప్రస్తావించడం అంటే అంతకన్నా సమర్థులు లేరని కాదు. కానీ ప్రస్తుతం పంచ్ ల కాలంలో పలువురిని ఆకట్టుకుంటున్న వారి గురించి చెప్పుకోవడమే అన్నది ప్రధానాంశం
తిరుమల ప్రసాద్ పాటిల్:= ఐటీ రంగంలో నిపుణుడైన ఈ రాయదుర్గం వాసి విషయాన్ని అత్యంత సమర్థవంతంగా అందించడం ద్వారా అనేకమంది అబిమానాన్ని సాధించారు. ఇటు చంద్రబాబు, అటు కేసీఆర్ ప్రభుత్వాల విధానాలపై సూటిగా స్పందిస్తూ చాలామందిని ఆకట్టుకుంటున్నారు. ఇటీవల 123 జీవో కు సంబంధించి ఆయన చేసిన కృషిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగింది. గతంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు కొందరు అమరావతి విషయంలో పాటిల్ చొరవ మీద అతిగా వ్యవహరించినప్పటికీ ఆయన మాత్రం వెనక్కి తగ్గకుండా సాగుతున్నారు.
మంచాల శ్రీనివాస రావు:= స్వతహాగా జర్నలిస్టు అయిన మంచాల వారు మంచి సెటైరికల్ స్పెషలిస్టు. వరంగల్ జిల్లా వాసి అయిన మంచాల మంచి పట్టున్న పద శిల్పి. నిత్యం అనేక అంశాల మీద ముక్కు సూటిగా తన వైఖరి చాటుకుంటారు. రెండు, మూడు లైన్లలోనే మొత్తం విషయాన్ని చెప్పగలగడం ఆయన సమర్థత. అందుకే మంచాల వాల్ మీద పోస్ట్ రాగానే చాలా మంది స్పందించడానికి వాలిపోతారు. ఆసక్తికర చర్చలు సాగిస్తుంటారు.
చిగురుపాటి రామచంద్రయ్య :=సామాజికవేత్తగా అందరికీ పరిచితులు. తెలుగు మీడియా పాఠకులకు, వీక్షకులకు కూడా రామచంద్రయ్య పరిచయమే. రాత, కూత వినిపించిన ఆయన ఇప్పుడు ఎఫ్ బీలోనూ నిత్యం కనిపిస్తుంటారు. అనేక సామాజిక అంశాలను స్పృశిస్తారు. చాలామందిలో చర్చను రేకెత్తిస్తారు.
కస్తూరి శ్రీనివాస్:= కవిగా, రచయితగా, జర్నలిస్టుగా కూడా కస్తూరి శ్రీనివాస్ ప్రసిద్ధుడు. ఆయన పూర్తిగా పంచ్ రైటర్ అని చెప్పాలి. ఫేస్ బుక్ లో ఆయన సింగిల్ లైన్ సెటైర్స్ తో సత్తా చాటుతున్నారు. చాలామందిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. మంచి రచనా సామర్థ్యంతో పలువురి అభిమానాన్ని పొందారు.
శ్రీధర్ రెడ్డి అవుతు:= గుంటూరుకి చెందిన ఈ ఎంబీఏ విద్యావేత్త చంద్రబాబు సర్కారుతో చెడుగుడు ఆడుతున్నారు. అతిసూక్ష్మంగా పరిశీలిస్తూ జీవోలతో సహా జనాల ముందుకు తెస్తుంటారు. వాటిలో లోపాలను ఎండగడుతుంటారు. వైఎస్సార్సీపీ కి సోషల్ మీడియాలో శ్రీధర్ రెడ్డి మంచి బలమైన ఆయుధంగా పలువురు భావిస్తారు. భాషలో పట్టులేకపోయినప్పటికీ విషయం మీద ఉన్న జ్ఞానంతో ఆయన విశేషమైన కృషి చేస్తున్నారు.
మురళీ బుద్ధ:= అనువజ్ఞుడైన, చేయి తిరిగిన జర్నలిస్టు. సెటైరికల్ రచనలతో ఆంధ్రభూమి ని ఆసక్తిగా మలుస్తున్నారు. పత్రిక ద్వారానే కాకుండా ఇటీవల పేస్ బుక్ ద్వారా మురళీ బుద్ధ పోస్టుల కోసం చాలామంది ఎదురు చూసే పరిస్థితి తీసుకొచ్చారు. రాజకీయ పక్షాల మీద, నేతల మీద మురళీ వ్యాఖ్యలు ఇట్టే ఆకట్టుకుంటాయి.
శివ రాచర్ల=: ప్రకాశం జిల్లా వాసి. ఇరిగేషన్ రంగంలో ఉన్న పట్టుతో ప్రభుత్వ గుట్టు రట్టు చేస్తుంటారు. సర్కారు విధానాల వైఫల్యాన్ని ఎండగడుతూ ఉంటారు, క్యూసెక్కుల అసలు చిక్కులు, టీఎంసీల లోతులు కనిపెట్టి సాధారణ జనాలకు కూడా అర్థమయ్యేలా వివరిస్తూ ఉంటారు. నిత్యం జలవనరుల వ్యవహారాలను పరిశోధించి జనం ముందు పెడుతుంటారు.
సతీష్ చాగంటి…= అధికార పక్ష వాణిని అత్యంత సమర్థవంతంగా, అందరినీ ఆకట్టుకునేలా పోస్టింగ్స్ చేయడంలో సిద్ధహస్తుడు. మణిపాల్ ఐటీలో చదువుకున్న ఈ విజయవాడ వాసి పోస్టులు కూడా చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. సూటిగా ఉండడం సతీష్ స్పెషాలిటీగా చెప్పవచ్చు.
అంజిబాబు” ఓ యంగ్ జర్నలిస్టు. కానీ ఫేస్ బుక్ పుణ్యాన మంచి ప్యాపులారిటీ సాదించాడు. ఆసక్తికర ఫోటోలు, మంచి మంచి కామెంట్స్ తో పలువురి మన్ననలు పొందారు.
విజయ్ కుమార్ మానం ఫ్రీలాన్స్ జర్నలిస్టు. ఆసక్తికర అంశాలతో పోస్టులు పెడుతూ అందరినీ ఆకట్టుకుంటారు. సామాజిక, రాజీకీయ అంశాలపై తన మార్క్ విశ్లేషణలు చేస్తారు.
–ఉత్తరాంధ్ర శ్రీనివాస్: ఓ ప్రాంతాన్నే తన ఇంటిపేరుగా మార్చుకున్న శ్రీనివాస్ నిత్యం చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉంటారు.
వీరు మాత్రమే కాకుండా ఇంకా వందల వేల మంది ఫేస్ బుక్ నిండా తమ సామర్థ్యం ప్రదర్శిస్తున్న వారు ఉన్నారు. ఎక్కువ మంది తమ వ్యాపార, రాజకీయ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ మీడియాను వాడుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం దానికి భిన్నంగా జనాలలో కొత్త అంశాల మీద చర్చను, ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి జాబితాలో ఇంకా అనేకమంది ఉండవచ్చు. కానీ వీరు మాత్రం ముందు వరుసలోనే ఉంటారని చెప్పవచ్చు.
Comments
Post a Comment