"కావాల్సినంత వర్షం కురిసింది: సీఎం కేసీఆర్"
రాష్ట్రంలో వర్షాలు కావాల్సినంతగా కురిశాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. రాబోయే రోజుల్లో కరువు అనేదే ఉండదన్నారు. ప్రజలు వానలను చూసి చాలా సంతోషిస్తున్నారని పేర్కొన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లాలో మిడ్‌మానేరు, లోయర్ మానేరు డ్యాంలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిజాం సాగర్ నుంచి 90 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉందని తెలిపారు.
మిడ్ మానేరుకు వరద వల్ల కట్ట తెగి నీళ్లు ప్రవహించాయని తెలిపారు. మిడ్ మానేరు ఎడమ వైపు పనులు పూర్తి కాక పోవడంతో వరద నీరు ప్రవహించిందని తెలిపారు. ముందు జాగ్రత్తగా ఈ మిడ్‌మానేరు కింద ఉన్న గ్రామాల నుంచి పన్నెండు వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారని తెలిపారు. వారికి పునరావాస కేంద్రాల్లో నీళ్లు, ఆహారం అందిస్తున్నారని తెలిపారు. మిడ్‌మానేరు ఇద్దరకు కాంట్రాక్టర్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నామన్నారు. త్వరలో దీనికి టెండర్లు పిలుస్తామన్నారు.
ఎల్‌ఎండీ నిండిందని ఇంకా మరో మూడు టీఎంసీల నీరు నిండాల్సి ఉందన్నారు. జూరాల నిండిపోయి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వస్తోందని తెలిపారు. ఆల్మట్టి, నారాయాణపూర్ జలాశయాలకు వరద వస్తోందన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం పెద్దగా జరగలేదని, ఏదైనా పిడుగుపాటు ఇలాంటివి జరిగాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల నష్టపరిహారం అందిస్తామన్నారు. జూరాల నిండిపోయి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు వస్తుందని వివరించారు. అధికారులు ఎమ్మెల్యేలు, ఎంపీలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి విపత్తు సంభవించకుండా చూసుకోవాలని ఆదేశించారు. అంతకు ముందు ఆయన మిడ్‌మానేరు, ఎల్లంపల్లి పరిసరాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.

Comments