గోవు సకల దేవతల స్వరూపం

గోవులను గూర్చి కీర్తించని గ్రంధములు మన సనాతన ధర్మంలో బహు అరుదు అనే చెప్పవచ్చు. గోవు అనేటప్పటికే ఒక ప్రత్యేకమైన ఆరాధనా భావం మనస్సుకి స్ఫురిస్తుంది. కారణం ఒక్కటే. తాత్త్వికంగా గోవు పశువు కాదు.. గోమాత, జగజ్జనని స్వరూపం.. అమ్మ అన్న పిలుపులో ఉన్న మాధుర్యమే గోమాతలో కూడా ఉందనిపిస్తుంది. అందుకే మహా మహులెందరో గోసేవ చేయడం మహా భాగ్యంగా భావించారు.

గోమాతలో సర్వ దేవతలు వుంటారు కాబట్టి గోసేవ చేసి పుణ్య ఫలాన్ని పొందాలని పండితులు సూచిస్తున్నారు. పూర్వం సాధువులు అధికంగా గో పూజలు చేసేవారు వివిధ మఠాల పీఠాధిపతులు, రామకృష్ణ పరమహంస, వివేకానంద వంటి వాళ్లందరూ ఇష్టపడి చేసిన పూజ గోపూజ. సకల దేవతలు గోమాతలో కొలువై ఉన్నట్టు ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందుకే హైందవులు గోపూజకు అంత్యంత ప్రాధాన్యత నిస్తారు.

దేవ రహస్యాన్ని కనుగొనే మహత్మ్యం గోవుకు మాత్రమే ఉంటుందని శాస్త్రాలు చెపుతున్నాయి. అందువల్లే గోపూజకు శాస్త్రాల్లో ఎనలేని ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాంటి పరమ పవిత్రమైన గోవును సేవించుకునేందుకు అమావాస్య మంచిరోజుగా భావిస్తారు. శని దోషం ఉన్నవారు ప్రతి శనివారం నల్లని ఆవుకు తవుడు, పచ్చగడ్డి సమర్పించి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే... శని దోషం నివారణ అవుతుందట. కుజదోషం వల్ల వివాహంలో ఆటంకాలు కలుగుతుంటే ప్రతి మంగళవారం ‘కందులు’ నానబెట్టి ఎర్రని ఆవుకు తొమ్మిది వారాలపాటు తినిపిస్తే సత్ఫలితాలుంటాయట. అందుకే గోవు సకల దేవతల స్వరూపంగా భావింపబడుతోంది.

శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి, సేవించి గోపాలకుడైనాడు. ‘ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః’ అని శాస్త్ర వచనం. సరైన ఆహారాన్ని తీసుకుంటే వ్యక్తిలో శాంతగుణం పెరుగుతుందనీ శ్లోకార్థం. అందుకే మన మహర్షులు గోవుల్ని పెంచి ఆ క్షీరాన్ని స్వీకరించి సత్వగుణ సంపన్నులైనారు. ఈ ప్రపంచంలో గోవులది మాతృస్థానం. తల్లివలె గోవు వాత్సల్య మూర్తి. తనను సేవించిన వారిని అది తల్లివలె ప్రేమిస్తుంది. అందుకే శ్రీ కృష్ణుడు తన చిన్నతనమునుండే గోవులను పూజించాడు, రక్షించాడు. ‘గోపాలుడు’ అనే పేరు సార్థకము చేసుకున్నాడు.

మాతరః సర్వ భూతానాం - గావః సర్వ సుఖ ప్రదా - అని మరో పురాణ వచనం. గోవు అందరికి తల్లి. అందుకే మనం గోమాత అని వ్యవహరిస్తాం. అలాగే గోవు సర్వ విధాల సుఖ ప్రదాత. గోమయము, గోమూత్రం, గో క్షీరము, గో ధధి, గో ఘ్రుతము వీటిని పంచగవ్యములు అంటారు. వీటిలో సహజంగా అతి ప్రభావవంతమైన జీవసృజన, రోగ నివారణ గుణ సంపద మెండుగా వుంటుందని మన ఋషులు, శాస్త్రవేత్తలు నిర్ధారణ చేసారు. వాటిని మన జీవన శైలితో జతచేసి మనకెంతో ఉపకారం చేసారు. ఈ పంచ గవ్యములు ఔషధ గుణాలకు సర్వశ్రేష్ఠమని ఆయుర్వేద శాస్త్రమే కాకుండా, ఇతర వైద్య శాస్త్రాలు కూడా గుర్తించాయి. గోమయే వసతే లక్ష్మీ.. గోమయంలో లక్ష్మీదేవి నివాసముంటుంది. అందుకే మన పూర్వీకులు ఉదయాన్నే ఆవు పేడతో కళ్లాపి జల్లేవారు. గృహం ఎప్పుడూ లక్ష్మీ ప్రదంగా వుండాలనే భావనతో దీన్ని మన సంస్కృతిలో ఒక భాగం చేసారు. ఇక ఆవు పాలు గంగానదితో సమానమని కాశీఖండములో చెప్పబడింది.

గోవు పవిత్రతకు, శుభానికి చిహ్నం.ఆవును దర్శించి దైనందిన జీవితం లోని పనులు ప్రారంభించడం ఎంతో శుభ శకునంగా భావిస్తారు. అలాంటి గోవుకు పూజలు చేస్తే.. సేవలు అందిస్తే... ఇంకెంత పుణ్యం వస్తుందో మరి..
ఆవులను కబేళాలకు తరలిస్తున్న ఈ రోజుల్లో వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా గోవులను భారంగా భావించనవసరం లేదు. ఒక ఆవు నలుగురు సభ్యులున్న ఒక కుటుంబాన్ని పోషించగలుగుతుంది. గో క్షీరము, గోమూత్రము, గోపేడ ఎంతో ఉపయుక్తమైనవి. వాటిని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంతో గోవుల పోషణ భారం కానేకాదు.
గోపూజ, గోసేవ ద్వారా పుణ్యం, గోవులు అందించే పంచగవ్యాల వలన ఆరోగ్యాన్ని పొందవచ్చు.


యన్. శివానందం


Mobile: 9247171906, E-mail: n.sivananda123@gmail.com

Comments